26, జూన్ 2018, మంగళవారం

CHITHRAGUPTHUDI TEMPLES IMPORTANCE

ఇక్కడ చిత్రగుప్తుడి ఆలయ దర్శనంతో అకాల మృత్యు భయం పోతుంది
మనుష్యుల పాప పుణ్యాలను అనుసరించి వారికి శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మన పురాణాల్లో చెప్పబడిన విషయం తెలిసిందే. ఆ యముడికి భారత దేశంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. వీటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.
ఎందుకంటే యమధర్మరాజు ప్రాణాలు తీసే వాడని ప్రజలు నమ్ముతారు. ఆయన నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిదని భావిస్తుండటం వల్ల యమధర్మరాజుకు ఆలయాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేవు. ఇదిలా ఉండగా ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాపపుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్కగట్టలేడు కదా. ఆయనకు ఈ విషయంలో సహకారం అందించడానికి ఉన్న వ్యక్తి చిత్రగుప్తుడు.
ఈయనకు కూడా భారత దేశంలో అక్కడడక్కడా ఆలయాలు కనిపిస్తాయి. ఆ ఆలయాల దర్శనం వల్ల ఆకాల మృత్యు భయం పోతుందని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించి కథనం మీ కోసం
ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లేవి. ఇలా వెళ్లిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు.
ఎందు కంటే ఎవరు ఎంత పాపం చేసింది సరిగా నిర్ణయించలేకపోయేవాడు. దీంతో తన ఇబ్బందిని యమధర్మరాజు తండ్రి, స`ష్టికర్త అయిన అయిన బ్రహ్మకు విన్నవించాడు. దీంతో సమస్య పరిష్కారం కోసం కొద్దికాలం బ్రహ్మ యోగనిద్రలోకి వెళ్లాడు.
కళ్లుతెరిచిన తర్వాత ఆయనకు ఎదురుగా ఓ ఆజానుబాహుడు కనిపించాడు. చేతిలో పుస్తకం, ఘటం (పెన్ను), నడుముకు కత్తి ఉంటాయి. తర్వాత తన దివ్యద`ష్టితో జరిగిన విషయం తెలుసుకొంటాడు. ఆ వ్యక్తి తన చిత్తం (శరీరం)లో గుప్తంగా (గుప్తంగా) నివాసమున్నవాడని అర్థమవుతుంది.
దీంతో అతనికి చిత్రగుప్తుడని పేరుపెడతాడు. అటు పై నీవు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో రహస్యంగా ఉంటూ వారి మంచి చెడులను గూర్చి తెలుసుకొంటూ ఉంటావు. ఈ విషయాలన్నీ యమధర్మరాజుకు చెబుతూ పాపాత్ములకు శిక్షలు పడేవిధంగా సహాయపడుతావని చెబుతాడు.
అంతేకాకుండా ఏక కాలంలో కొన్ని కోట్ల రూపాలను ధరించే శక్తి కూడా నీకు ఉంటుందని బ్రహ్మ చిత్రగుప్తుడికి వరమిస్తాడు. అంతేకాకుండా చిత్రగుప్తుడికి ఈ విషయంలో సహాయపడటానికి కొంతమంది సహాయకులుగా కూడా ఉంటారు.
వారిలో ద్వారపాలకుడైన ధ్వజుడితో పాటు బ్రహ్మమానసపుత్రులైన శ్రవణులు. శ్రవణులు ఈ భూ లోకం పైనే కాకుండా పాతాళ, మత్స్య, స్వర్గ లోకాల్లో కూడా వివహరిస్తూ జీవుల పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియజేస్తూ ఉంటారు.
ఇక యమపురి ద్వారపాలకుడైన ధ్వజుడు కూడా చనిపోయి నరకానికి వచ్చిన వారి గురించి చిత్రగుప్తుడికి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాడు. అందువల్లే ఈ విశ్వంలోని జీవుల పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతున్నాడని గరుడ పురాణం చెబుతోంది.
ఇక చిత్రగుప్తుడికి భారత దేశంలో చాలా తక్కువ చోట్ల మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. అందులో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ఒకటి ఉంది. అయితే చిత్రగుప్త దేవాలయం ఉన్నట్లు అక్కడి స్థానికులకు కూడా సరిగా తెలియక పోవడం గమనార్హం.
పాతబస్తీలోని నల్లవాగు స్మశాన వాటిక దగ్గర ఉన్న ఈ దేవాలయం కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెబుతారు. అయితే 250 ఏళ్ల క్రితం నిజాం నవాబుల కాలంలో రాజా కిషన్ పర్షాద్ అనే మంత్రి దీనిని అభివ`ద్ధి చేశాడు.
మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయం చాలా వరకూ కబ్జాకు గురయ్యింది. అయితే ఇటీవల ప్రభుత్వం ఈ ఆలయ సంరక్షణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆలయ నిర్వాహకుల సహకారంతో శివాలయం, సాయిబాబా ఆలయం, హనుమంతుడి ఆలయం, అయప్పస్వామి దేవాలయం నిర్మించింది.
దీంతో ప్రస్తుతం ఈ దేవాలయాన్ని చిత్రగుప్త ఆలయం అనడానికి బదులు నాలుగు స్వాముల దేవాలయం అని పిలుస్తున్నారు. ఇక ప్రధాన ఆలయంలో చిత్రగుప్తుడి రాతి విగ్రహం ఉంది. బుధవారం చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు.
బుధవారంతో పాటు దీపావళి రోజు మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపావళి రెండో రోజును యమద్వితీయ అని అంటారు. ఆరోజును చిత్రగుప్తుడి పుట్టిన రోజును నిర్వహిస్తారు. దీనినే భాయ్ దూజఖ్ అంటారు.
అకాల మృత్యువును జయించడానికి మాత్రమే ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం కోసం ఇటీవల ఈ దేవాలయాన్ని సందర్శించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతేకాకుండా కేతు గ్రహ దోష నివారణ పూజలు కూడా ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి.
హైదరాబాద్ లోనే కాకుండా భారత దేశంలో అక్కడక్కడా చిత్రగుప్తుడి దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా రాముడి జన్మస్థలమైన అయోధ్యలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో శ్రీరాముడు స్వయంగా పూజలు చేసినట్లు చెబుతారు.
అదేవిధంగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లోని ఫూటాతాల్, షిప్రా నదీ తీరంలోని రామ్ ఘాట్, ఉజ్జయినీ, ఖజురహోలో కూడా చిత్రగుప్తుడి దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు మూడు వందల ఏళ్లకు పూర్వం నిర్మించినవే.
అదే విధంగా రాజస్థాన్ లోని ఆల్వార్ తో పాటు తమిళనాడులోని మధురైలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. ఇదిలా ఉండగా యముడంటే ప్రజలు ఎలా భయపడుతున్నారో అలాగే చిత్రగుప్తుడంటే కూడా ప్రజలకు కొంత భయం. అందువల్లే ఆయన ఆలయాలు ఎక్కువగా లేవు. ఉన్న ఆలయాలు కూడా ప్రాచూర్యంలోకి రాకపోవడానికి భయం కారణమని ఆధ్యత్మిక వేత్తలు చెబుతున్నారు.

Mana telugu states lo eco tourism spots

#మన_తెలుగు_రాష్ట్రాలలో_చూడదగిన_పర్యాటక_అందాలు_ఆనందాలు

#పాకాల_చూసి_తీరాల!

పచ్చని చెట్లతో నిండిన అటవీ ప్రాంతం.. చుట్టూ ఎత్తయిన గుట్టలు..ప్రకృతి ఒడిలో ఒదిగిపోయినట్టుండే అందమైన సరస్సు.. అందులో కనిపించే జలచరాలు.. వీనుల విందు చేసే పక్షుల కిలకిలరావాలు.. వీటన్నింటినీ మించి అమితోత్సాహాన్ని కలిగించే బోటు షికారు. ఒకటా.. రెండా.. అక్కడికెళితే ప్రతిఒక్కరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. అక్కడి ఉల్లాసభరితమైన వాతావరణం మనసుకు ప్రశాంతతను పంచుతుంది. అలాగని అదెక్కడో ఫారిన్ కంట్రీలో ఉందనుకోవద్దు. అలాంటి అద్భుతమైన పర్యాటక శోభను సంతరించుకొన్న ప్రాంతం మన తెలంగాణాలోనే ఉన్నది. అదే పాకాల.

ప్రకృతికి పచ్చ కోక కట్టినట్టుగా కనిపిస్తూ రమణీయమైన దృశ్యవీక్షణలకు వేదికగా నిలుస్తున్నది పాకాల. వరంగల్ రూరల్ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్న పాకాలలో.. సందర్శకుల సందడి పెరుగుతున్నది. పర్యాటకులను పరవశింపజేస్తున్న ఇక్కడి ప్రకృతి అందాలను ఎంత వర్ణించినా తక్కువే అవుతుందనడంలో అతిశయోక్తి లేదు.
అద్భుతం.. ఆహ్లాదం..

వరంగల్ రూరల్‌జిల్లా ఖానాపురం మండలంలో ఉంటుందీ పాకాల. చుట్టూ అభయారణ్యాన్ని తలపించేలా దట్టమైన అటవీసంపదను సొంతం చేసుకున్నదీ ప్రాంతం. ఈ అభయారణ్యం ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. దుప్పులు, జింకలు, కొండ గొర్రెలు, అడవిపందుల వంటి వన్యప్రాణులు తరుచూ దర్శనమిస్తుంటాయి. మనసుకు అద్భుతమైన అనుభూతిని పంచుతాయి.
పర్యాటక శోభ

ట్రెక్కింగ్‌కు ఇటీవల కాలంలో మంచి క్రేజ్ ఏర్పడింది. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి.. ఇది మంచి స్పాట్‌గా చెప్పొచ్చు. ఇక్కడి ఎత్తయిన గుట్టలపై ట్రెక్కింగ్ చేయవచ్చు. ఇక ఉషోదయాన నీటిపైకొచ్చే సూరీడు.. పచ్చరంగు నింపుకొన్నట్టుగా కనిపించే ఆయకట్టు ప్రాంతమంతా పర్యాటకుల మదిని దోచేస్తున్నది.
జింకల పార్కు

దాదాపు 50ఎకరాల విస్తీర్ణంలో జింకల పార్కు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే పాకాలకు వచ్చిన వారంతా కళ్లెదుటే జింకలను చూస్తూ ఆనందపారవశ్యంలో మునిగితేలే అవకాశం ఉంది. అంతేకాకుండా పాకాలను అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చిలుకల గట్టుపై వాచింగ్ టవర్స్, పిల్లలపార్కు ఏర్పాటు చేయబోతున్నారు. పాకాల కట్ట బలోపేతం చేయడంతో పాటు కట్టకు ఇరువైపులా గ్రీనరీ, బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేయనున్నారు.

#కాటేజీల_ఏర్పాటు

ఇక్కడికొచ్చే పర్యాటకులు రాత్రిపూట బసచేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు అధికారులు. 39 లక్షలతో నాలుగు ఏసీ కాటేజీలు, 32 లక్షలతో మూడు గ్లాస్ కాటేజీలు, 1.04 కోట్ల రూపాయలతో గుట్టపై మరో ఏడు కాటేజీలతో పాటు చిన్నపాటి గుడారాలనూ సిద్ధం చేశారు. ఈ కాటేజీలను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ కాటేజీలకు ఏర్పాటు చేసిన అద్దాల నుంచే అద్భుతమైన పాకాల అందాలను వీక్షించవచ్చు. ఉషోదయంలో సరస్సు ఉపరితలంపై వాలిపోయే సూర్యకిరణాలను తప్పక చూసి తీరాల్సిందే.
కాలుష్య రహితం

కాంక్రీట్ జంగిల్‌కు కాసింత కాదు, చాలా దూరంగా ఉంటుంది పాకాల అభయారణ్యం. ఇంతకు ముందు పర్యాటకులు తమ వాహనాలను నేరుగా సరస్సు కట్టపైకి తీసుకెళ్లేవారు. అక్కడే కట్టెలపొయ్యి, గ్యాస్ పొయ్యిల సాయంతో వంటలు వండుకొని తినేవారు. అయితే అలా చేయడం వల్ల కాలుష్యం ఏర్పడుతున్నదని భావించిన అధికారులు.. వాటిని నిషేధించారు. వృద్ధులు, వికలాంగులు వెళ్లడానికి వీలుగా బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా కాలుష్యరహిత పాకాలగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
కాకతీయుల సృజనాత్మకత

పాకాలలోకి అడుగు పెట్టగానే అలనాటి కాకతీయుల ప్రపంచం కళ్ల ముందు మెదులుతుంది. సహజసిద్ధమైన గుట్టల నడుమ ఉండే భారీ సరస్సు.. కాకతీయుల సృజనాత్మకతకు అద్దం పడుతుంది. కొండకోనల నుంచి వచ్చే వర్షపు నీటిని ఒడిసిపట్టేలా, క్రీ.శ 1213లో కాకతీయ రాజు గణపతి రుద్రదేవుడు ఈ పాకాల సరస్సును నిర్మించాడు. నేటికీ ఇది అన్నదాతల పాలిట కల్పతరువుగా ఉంటున్నది. తీవ్రమైన కరువు సంభవించిన సమయంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ సరస్సును కాకతీయ రాజులు నిర్మించారట. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ నీటితో కళకళలాడడం ఈ సరస్సు ప్రత్యేకతగా చెబుతారు చరిత్రకారులు. 30 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన ఈ సరస్సు కింద వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది.

#ఎలా_వెళ్లాలి_అనుకుంటున్నరా

వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రానికి సరిగ్గా 46 కిలోమీటర్ల దూరంలో ఉన్నది పాకాల. హన్మకొండ నుంచి రోడ్డు మార్గంలో నర్సంపేటకు, అక్కణ్నుంచి పాకాలకు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి వరంగల్, కాజీపేటకు రోడ్డు, రైలు మార్గాల్లో చేరుకొని, అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో పాకాల చేరుకోవచ్చు. పాకాలే కాదు , అక్కడికి వెళ్లే మార్గమూ మధురానుభూతిని కలిగిస్తుంది. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే మార్గంలో అటు ఇటుగా ఉండే పచ్చటిపొలాలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. అవన్నీ పాకాల ఆయకట్టు కిందే ఉండడం విశేషం.
ప్రత్యేక ఏర్పాట్లు

పాకాలకు వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. చారిత్రక సరస్సు పరిసరాల్లో ఆకర్షణీయమైన విడిది కేంద్రాలను నెలకొల్పింది. అడవిలో ఏసీతో కూడిన కాటేజీలనూ ఏర్పాటు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నది. భోజన సౌకర్యం కోసం పర్యాటక శాఖ ప్రత్యేకంగా రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాకాల అటవీ ప్రాంతంలో విడిది చేసే పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. గుట్టలపై ఏర్పాటు చేసిన కాటేజీల్లో విడిది చేసే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతాచర్యలు తీసుకుంటున్నారు...

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...